అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి సర్కార్ సాగు రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ప్రత్యేకించి రైతులకు భరోసా కల్పించేలా చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి విచ్చేసిన కేంద్ర మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ ను సీఎం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వినతి పత్రం అందజేశారు నారా చంద్రబాబు నాయుడు. వ్యవసాయం, అనుబంధ రంగాల సమగ్ర అభివృద్ధికి, రైతుల ఆదాయాన్ని పెంచే చర్యలకు మరింత సహకరించాలని కోరారు. కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డుతో సహా వ్యవసాయ విశ్వ విద్యాలయాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని విన్నవించారు.
ఏపీ పునర్విభజన చట్టం–2014, షెడ్యూల్ 13లో పేర్కొన్నట్టుగా రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ విశ్వవి ద్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. దీని వల్ల ఇక్కడి విద్యార్థులకు, పరిశోధన చేసేందుకు వీలు కలుగుతుందన్నారు. ఆంధప్రదేశ్ రాష్ట్రం విడి పోయి 11 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు సమస్యలు ఇంకా పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా తమకు తెలంగాణ రాష్ట్రం నుంచి రావాల్సిన నిధులను ఇప్పించాలని కూడా కోరారు కేంద్ర మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్ ను. రూ.2,585 కోట్ల అంచనాలతో డీపీఆర్ను వ్యవసాయ పరిశోధన, విద్య విభాగానికి సమర్పించినట్లు చెప్పారు. అమరావతి పర్యటనలో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికారు సీఎం.



















