అమరావతి : తాను ప్రపోజ్ చేసిన మావిగన్ అంటే సీఎం చంద్రబాబుకు వణుకు పుడుతోందన్నారు మాజీ సీఎం జగన్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని దివాలా తీసే పనిలో పడ్డాడని మండిపడ్డారు. పాలన గాడి తప్పిందని, కేవలం తమ వర్గానికి మేలు చేకూర్చేలా పనులు చేస్తున్నాడని ఆరోపించారు. ఒక టైలర్ మేడ్, రిగ్గింగ్ పద్ధతిలో టెండర్లు కట్టబెట్టాడని అన్నారు. ఇక అమరావతి ప్లాట్ల స్కామ్లు చూస్తే, చంద్రబాబు మనుషులకు, ఏబీఎన్ రాధాకృష్ణ, అశ్వినీదత్, బలుసు శ్రీనివాసరావు , బెజవాడ రమేష్, ఇంకా ఆయన బినామీలకు అమరావతిలో రోడ్ల పక్కనే విలువైన ప్రాంతాల్లో రిటర్న్బుల్ ప్లాట్లు ఇస్తున్నారని ఆరోపించారు. కాని సామాన్య రైతులకేమో చెరువుల్లోనూ, వాగుల్లోనూ, కుంటల్లోనూ ఇవ్వడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
బాధ్యతగల ప్రతిపక్షంగా మేం ఇవన్నీ బయట పెడుతున్నామని చంద్రబాబు అబద్దాలు చెప్తూ మమ్మల్ని తిట్టడమే కాదు, వాళ్ల మంత్రులతో కూడా దారుణంగా అబద్ధాలతో తిట్టిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ రెడ్డి. మావిగన్ నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఎంతటి అన్యాయం చేయడానికైనా చంద్రబాబు వెనుకాడడం లేదన్నారు. కడపలో పెద్ద దస్తగిరి అని మా పార్టీకి చెందిన వ్యక్తి మరణిస్తే, ఈకేసు పూర్తిగా తిప్పేసి, మా పార్టీమీద బురద జల్లడానికి వాడుకుంటున్నారని ఆరోపించారు. మా కుటుంబంలో ఫ్యాక్షన్ రాజకీయాలలకు మా తాత, నాన్న, చిన్నాన్న బలై పోయారని వాపోయారు జగన్ రెడ్డి. మేం బాధితులం. కాని, తిరిగి మాపైనే వీళ్లు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
