అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సర్కార్ సహకారం అందిస్తుండడంతో ఏపీ అన్ని రంగాలలో ముందుకు వెళుతోందన్నారు . నాడు ఎన్నికల్లో చెప్పిన అన్ని పథకాలు ఇస్తున్నామంటే కేంద్రం ఎంతో సహకారం అందిస్తుండడం వల్లనే సాధ్యమైందన్నారు. అందుకే వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టాం అన్నారు సీఎం. కేంద్రం అమరావతి, పోలవరానికి డబ్బులు ఇవ్వకపోయి ఉంటే నేడు ఈ ప్రాజెక్టులు ప్రారంభం అయ్యేవి కాదన్నారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకిత చేస్తున్నామంటే కేంద్రం సాయం అందించడమే కారణం అన్నారు చంద్రబాబు నాయుడు.
విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్ర సాయంతో నిలబెట్టామని చెప్పారు. మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం, మన విశాఖ కోసం కేంద్రం తన పాలసీనే మార్చుకుని సాయం చేసిందన్నారు. ఇది చిన్న విషయం కానే కాదన్నారు . కేంద్ర సాయంతో మొదటిసారిగా ఒక్క నెలలో రూ.54 కోట్ల లాభాలను విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించిందని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు. ఇదే స్థాయిలో పని చేస్తే అత్యుత్తమ ప్రాజెక్టుగా నిలుస్తుందన్నారు. సూపర్ సిక్స్తో సహా అన్ని సంక్షేమ పథకాలను అందిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం సహకారం వల్లనే ఇవన్నీ సాధ్యం అవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలపై ఎమ్మెల్యేలు ఓనర్ షిప్ తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి.

















