Cement : దేశ వ్యాప్తంగా సిమెంట్ ధరలు తగ్గాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ మార్కెట్లో 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.30 వరకు తగ్గింది. ఈ నెల 21 వరకు బ్రాండ్ ఆధారంగా ధర రూ.290 నుంచి రూ.370 మధ్య ఉండగా, జీఎస్టీలో తగ్గింపు కారణంగా ఇప్పుడు అది రూ.260 నుంచి రూ.330 వరకు పలుకుతోంది.
జీఎస్టీ భారం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గడంతో ఈ తగ్గింపు సాధ్యమైందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గత నెల రోజులుగా వినియోగదారులు కొనుగోళ్లపై ఆసక్తి చూపించడం కూడా మార్కెట్ పుంజుకోవడానికి దోహదపడిందని రిటైల్ డీలర్లు తెలిపారు.
Cement – పెరుగుతున్న డిమాండ్
ఇటీవల వరకు దేశ వ్యాప్తంగా సిమెంట్ (Cement) అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండేవి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి నెల సగటున 23–25 లక్షల టన్నుల సిమెంట్ విక్రయమయ్యేది. వర్షాల ప్రభావంతో ఆ సంఖ్య గత నెల 21 లక్షల టన్నులకు పడిపోయిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
అయితే పండుగల సీజన్, జీఎస్టీ తగ్గింపు లాభం కారణంగా రాబోయే నెలల్లో అమ్మకాలు మళ్లీ వేగం పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఉత్పత్తి సామర్థ్యం వినియోగం 55–60 శాతం ఉండగా, జనవరి నాటికి అది 60 శాతం మించవచ్చని ఒక ప్రముఖ కంపెనీ డైరెక్టర్ అభిప్రాయపడ్డారు.
Also Read : Ashwini Vaishnaw Important Update : స్వదేశీ పరిజ్ఞానంతో వచ్చిన ‘జోహో’ ను పరిచయం చేసిన కేంద్రమంత్రి


















