Bhumana Karunakar Reddy : తిరుపతి : ప్రభుత్వం అనుకూల అధికారులను కాపాడుకునేందుకు, వాస్తవాలు వెలుగు చూడకుండా ఉండేందుకు తిరుపతి తొక్కిసలాటపై జ్యుడీషియల్ విచారణను నిర్వీర్యం చేశారని మాజీ టీటీడీ (TTD) చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి (Bhumana Karunakar Reddy) మండిపడ్డారు. శుక్రవారం తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ తొక్కిసలాటకు బాధ్యులైన వారంతా సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుఆ ఉన్నారని ఆరోపించారు. అందుకే వారిని కాపాడేందుకు మొత్తం నివేదికనే నీరుగార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందిస్థాయి ఉద్యోగులను బలి పశువులను చేశారని ధ్వజమెత్తారు. ఈ ఘటనలో అసలు నిజాలు బయటకు రావాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Bhumana Karunakar Reddy Demands Tirumala Stampede to Investigate with CBI
వైయస్ జగన్ సీఎంగా ఉండగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వీలైనంత ఎక్కువమంది భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలన్న ఉద్దేశంతో శ్రీరంగ పట్టణాన్ని ఆదర్శంగా తీసుకుని పది రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను కల్పించడం జరిగిందన్నారు. 23 మంది మఠాధిపతుల ఆశీర్వాదాలతో దేశంలోని హిందువులంతా గర్వించేలా రెండేళ్ల పాటు అత్యద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. రెండేళ్లు కూడా వైకుంఠ ఏకాదశికి ముందు రోజు రాత్రే పది రోజులకు టోకెన్లు ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో ఎలాంటి తొక్కిసలాట జరగుండా భక్తులు టోకెన్లు తీసుకుని నిర్విఘ్నంగా స్వామి వారి దర్శనం చేసుకుని వెళ్లిపోయారని చెప్పారు కరుణాకర్ రెడ్డి.
కానీ కూటమి ప్రభుత్వంలో టోకెన్ల పంపిణీ అడ్డగోలుగా జరిగిందని ఆరోపించారు. జనవరి 10,11, 12వ తేదీలకు మాత్రమే టోకెన్లు ఇస్తామని చెప్పారు. అక్కడున్న పరిస్థితిని చూసి మిగతా ఏడు రోజులకు టోకెన్లు ఇస్తామని ప్రోసీడింగ్స్లో పేర్కొన్నారని అన్నారు. టోకెన్ల పంపిణీలో కనీస జాగ్రత్తలు పాటించక పోవడంతో 6 మంది భక్తులు చనిపోగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారని వాపోయారు. జనవరి 9న తొక్కిసలాట జరిగిన ప్రాంతాలను సీఎం చంద్రబాబు సందర్శించి జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఈవో, సీవీఎస్వో మీద తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారని అన్నారు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం తిరుపతికి వచ్చి ఈ ఘటనకు టీటీడీ (TTD) చైర్మన్, ఈవో, చైర్మన్ల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమని నిర్ధారించి వారు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం నిందితుల తరఫున ఆయనే క్షమాపణలు చెప్పేసి వచ్చారు. ఈ దుర్ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల నుంచి తీవ్రమైన ఆగ్రహావేశాలు పెల్లుబుకడంతో ప్రభుత్వం జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు
జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడానికి ముందే డెయిరీ ఫామ్ అధికారి హరినాథరెడ్డి, క్రైమ్ డీఎస్పీ రమణ కుమార్ని బాధ్యులను చేస్తూ సీఎం చంద్రబాబు సస్పెండ్ చేశారని ఆరోపించారు. ఎస్పీ సుబ్బారాయుడు, జేఈవో గౌతమిలను మాత్రం బదిలీ చేసి వదిలేశారన్నారు. ఆరు నెలల తర్వాత ఇచ్చిన కమిషన్ నివేదిక చూస్తే విచారణ పేరుతో తమకు కావాల్సిన వారితోనే సాక్ష్యం ఇప్పించుకుని ప్రభుత్వమే రిపోర్టు రాసి వారితో ఇప్పించినట్టు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నిన్న కేబినెట్ మీటింగ్లో తీసుకున్న నిర్ణయం చూస్తే అసలు నిందితులను వదిలేసి మేకలను బలిచ్చినట్టుగా ఉందన్నారు.
Also Read : Minister Vasamsetti Interesting Comments : రాష్ట్రానికి భరోసా ప్రజలకు ఆసరా : వాసంశెట్టి
