ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ గా భరత్ భూషణ్

వైస్ చైర్మన్ గా మెహర్ రమేష్

hellotelugu-PFDCChairmaan

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కొలువు తీరిన చాలా గ్యాప్ త‌ర్వాత కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఖాళీగా ఉన్న‌ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫిల్మ్ టివి థియేటర్ అభివృద్ధి సంస్థ (FDC) చైర్మన్, డైరెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్ గా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ పి.భరత్ భూషణ్ పేరుకే మొగ్గు చూపించింది. వైస్ చైర్మన్ గా దర్శకుడు మెహర్ రమేష్ ను ఎంపిక చేసింది. ఈ ఇద్ద‌రితో పాటు 14 మంది డైరెక్టర్లను నియమించింది. సినీ రచయిత, తెనాలి కళల కాణాచి పరిషత్ నిర్వాహకులు బుర్రా సాయి మాధవ్, చిలకలూరిపేటకు చెందిన రిటైర్డ్ అధ్యాపకులు, రచయిత డా. కందిమళ్ల సాంబశివరావులను డైరెక్టర్లుగా నియమించారు.

అలాగే హీరో సుమన్ తల్వార్, హీరో శివాజీ, నిర్మాతలు చదలవాడ శ్రీనివాసరావు, కూచిభోట్ల వివేకానంద, నటి ఝాన్సీ, సీనియర్ జర్నలిస్ట్ కె.ఉమా మహేశ్వరరావు, దర్శకుడు వి. సముద్ర, మీర్ ఎస్, ఎ.సత్యనారాయణ, దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి, జి.రాజ్ వెంకటేశ్వర యాదవ్, డి. సత్యనారాయణ లను డైరెక్టర్లుగా నియమించారు. ఇక టివి, సినిమా నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు ఈ కమిటీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సినిమా, టివి షూటింగులు జరిగేందుకు, సినీ, టివి, రంగస్థల కళాకారుల అభివృద్ధికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చిత్తశుద్ధితో కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Exit mobile version