ముంబై : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన ప్రకటన చేసింది. శనివారం ఈ మేరకు అధికారికంగా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్ ) 2026లో పాల్గొంటున్న ఆయా జట్ల యాజమాన్యాలకు కీలక సూచనలు చేసింది. గత కొంత కాలంగా కొన్ని జట్ల మేనేజ్మెంట్స్ బాధ్యులు తమ జట్లు ఓడి పోతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు ఫ్యాన్స్ చూస్తున్నారన్న సోయి లేకుండానే తమ టీంకు చెందిన కెప్టెన్లను, ఆడని ప్లేయర్లను లక్ష్యంగా చేసుకుని కామెంట్స్ చేయడం, వార్నింగ్ ఇవ్వడం పరిపాటిగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.
దీంతో దీనిని సీరియస్ గా తీసుకుంది బీసీసీఐ. ఈ మేరకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది ఐపీఎల్ జట్ల యాజమాన్యాలకు. మైదానంలో ఏ ఆటగాడిని అవమానించడానికి ఏ జట్టు యజమానికో లేదా యాజమాన్య వర్గానికి చెందిన వారికో అనుమతి లేదని పేర్కొంది. ఈ మేరకు బీసీసీఐ ఒక హెచ్చరిక జారీ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిబంధనలలో ఈ విషయం స్పష్టంగా ప్రస్తావించినట్లు తెలిపింది. ఒకవేళ అటువంటి సంఘటన సంభవిస్తే, దానికి బాధ్యులైన వారు యజమాని అయినా లేదా యాజమాన్య సభ్యులైనా సరే, వారిపై నిషేధం విధించడం జరుగుతుందని పేర్కొంది. ఇది తమ తుది హెచ్చరిక అని, ఇటువంటి దృశ్యాలు మళ్లీ కనిపించ కూడదని బీసీసీఐ స్పష్టం చేసింది.
