అమరావతి : ఈ-ఫైళ్ల క్లియరెన్స్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసాధారణ వేగం ప్రదర్శిస్తూ పరిపాలనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఆయన తీసుకుంటున్న చర్యలు ప్రభుత్వ యంత్రాంగంలో చురుకుదనాన్ని పెంచుతున్నాయి. గతంలో ఈ-ఫైళ్ల క్లియరెన్స్కు సుమారు 5 గంటల సమయం తీసుకున్న అచ్చెన్నాయుడు, ప్రస్తుతం భారీ స్థాయిలో ఫైళ్లు వచ్చినప్పటికీ సరాసరి కేవలం 2 గంటల 49 నిమిషాల వ్యవధిలోనే ఫైళ్లను డిస్పోజ్ చేస్తుండటం పరిపాలనా సామర్థ్యానికి నిదర్శనమని అధికారులు వెల్లడించారు.
ఈ-ఫైళ్ల క్లియరెన్స్ను రోజుల వ్యవధి నుంచి గంటల వ్యవధిలోకి తీసుకు రావడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతృప్తి వ్యక్తం చేశారు. పరిపాలనలో వేగం, పారదర్శకత, ప్రజా ప్రయోజనాల పట్ల కట్టుబాటుతో ముందుకు సాగుతున్న అచ్చెన్నాయుడి పనితీరును సీఎం ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి అచ్చెన్నాయుడు నాయకత్వంలో వ్యవసాయ, అనుబంధ శాఖల పరిపాలన మరింత సమర్థవంతంగా మారుతోందని అన్నారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన కార్యాచరణ స్పష్టంగా ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
