అమరావతి : ఏపీ నైపుణ్యాభివృద్ది స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రోజు రోజుకు కీలక మలుపు తిరుగుతోంది ఈ స్కాం. ఇదిలా ఉండగా తాజాగా విశాఖపట్నం పీఎంఎల్ఏ కోర్టులో సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. జనవరి 28న పరిగణలోకి తీసుకున్న కోర్టు.. డిజైన్టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (DTSPL), వికాస్ ఖన్వేల్కర్, సుమన్ బోస్, ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ తదితరులపై సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. APSSDC – సీమెన్స్ ప్రాజెక్ట్కు సంబంధించి ఏపీ ప్రభుత్వ నిధులను పక్కదోవ పట్టించారని పేర్కొంది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. ఇందుకు గాను ఏపీ సీఐడీ ఎఫ్ఆర్ ఆధారంగా దర్యాప్తు చేశామని పేర్కొంది.
డిజైన్టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (DTSPL) మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ వినాయక్ ఖన్వేల్కర్, మిస్ సీమెన్స్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్, వారి సన్నిహిత సహచరులు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్లు కలిసి షెల్ కంపెనీల ద్వారా ప్రభుత్వ నిధులను మళ్లించారని దర్యప్తులో తేల్చింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ). మల్టీ లేయర్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ఏపీ ప్రభుత్వ నిధులను మళ్లించారని.. పరికరాలు, సేవలు సరఫరా చేసినట్టు చూపుతూ నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి నిధులను మళ్లించారని వెల్లడించారు. ఢిల్లీ NCR, ముంబై, పుణే ప్రాంతాల్లో ఉన్న బ్యాంక్ నిల్వలు, షేర్లు, స్థిరాస్తులను కలిపి రూ.23.54 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ప్రకటించింది. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం అటాచ్ చేసిన ఆస్తుల విలువ రూ.54.74 కోట్లని ED వెల్లడించింది.
