సింగపూర్ : ఏపీకి చెందిన మంత్రులు ఫుల్ బిజీగా ఉన్నారు సింగపూర్ పర్యటనలో. టూర్ లో భాగంగా శుక్రవారం సింగపూర్లోని ప్రసిద్ధ మెరీనా బ్యారేజ్ ను సందర్శించారు మంత్రులు అనిత వంగలపూడి, సత్యకుమార్ యాదవ్ , అనగాని సత్యప్రసాద్, కింజారపు అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి. సింగపూర్ కు తాగు నీరు అందించడం, వరద నియంత్రణతో పాటు ఒక గొప్ప వినోద కేంద్రంగా నిలుస్తోంది మెరీనా బ్యారేజ్ . పర్యావరణ అనుకూల నీటి సంరక్షణ విధానాలతో సింగపూర్ సాధించిన పురోగతి, మెరీనా బ్యారేజ్ ప్రాముఖ్యతను మంత్రులతో పంచుకున్నారు నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ సిటీస్ డైరెక్టర్ ఖూ టెంగ్ చై . గ్రీన్ రూఫ్, మెరీనా బే సాండ్స్ వంటి కట్టడాల వ్యూ పాయింట్గా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి బ్యారేజ్ చుట్టూ ఉన్న పరిసరాలు.
పర్యావరణాన్ని కాపాడుకుంటూ సింగపూర్ నీటి సమస్యలను ఎలా అధిగమించింది వంటి అంశాలను అధ్యయనం చేశారు మంత్రులు. కృష్ణా నది తీరం, అమరావతి రాజధాని ప్రాంతాల్లో ఈ తరహా అభివృద్ధి మోడల్ లు అమలు చేసే అవకాశంపై చర్చించారు. పర్యావరణహితంగా నీటి సమస్యలను అధిగమిస్తూ, గ్రీన్ రూఫ్ వంటి కట్టడాలతో మెరీనా బ్యారేజ్ ఎలా పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకుందో తెలుసు కోవడం చాలా స్ఫూర్తిదాయకంగా నిలిచిందన్నారు ఈ సందర్బంగా మంత్రి వంగలపూడి అనిత. మన అమరావతి రాజధాని ప్రాంతంలో, కృష్ణా నది తీరాన కూడా ఇటువంటి ఆధునిక డెవలప్మెంట్ మోడల్స్ను అమలు చేసే అవకాశాలపై మంత్రుల బృందంతో కలిసి చర్చించామన్నారు. అనంతరం సింగపూర్ పీఎంవో మాజీ మంత్రి మిస్టర్ లిమ్ స్వీ సే తో సమావేశం అయ్యారు.
