అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో ఏపీ రాష్ట్ర బడ్జెట్ 2026-2027 సంవత్సరానికి ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా అసెంబ్లీలో ప్రసంగించారు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, అన్నివర్గాలకు సమ ప్రాధాన్యం అందించేలా, సంక్షేమంతో కూడిన అభివృద్ధి ఫలాలు అందించేలా ఈ బడ్జెట్ ఉందన్నారు డిప్యూటీ సీఎం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలలు కంటున్న వికసిత్ భారత్ 2047 లో ప్రధాన భాగస్వామ్యం తీసుకునేలా స్వర్ణాంధ్ర 2047 దిశగా నడిపించేలా బడ్జెట్ రూపొందించడం జరిగిందన్నారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రాన్ని 360° లో సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది వేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సంవత్సరానికి రూ. 3,32,205 కోట్ల మొత్తం వ్యయంతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ప్రకటించిన బడ్జెట్ గ్రామం నుంచి గ్లోబల్ స్థాయి వరకు, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, యువత, మహిళా సాధికారత, సాంకేతికత ఇలా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే 360° సమతుల్య గ్రోత్ మోడల్గా ఈ బడ్జెట్ రూపుదిద్దుకుందని ప్రశంసించారు.
ముఖ్యంగా పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖకు 22,942 కోట్లు కేటాయింపులు జరపడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో గ్రామాల పాత్ర కీలకం అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పునరుద్గాటించిందని అన్నారు పవన్ కళ్యాణ్. తద్వారా గ్రామీణ మౌలిక సదుపాయాలు, గ్రామీణ రహదారులు, ఇంటింటికీ త్రాగునీటి సదుపాయం, ఉపాధి అవకాశాలు, స్థానిక పాలన బలోపేతం ద్వారా గ్రామాల ఆర్థిక పరిపుష్టికి ఈ కేటాయింపులు దోహదం చేయనున్నాయని ఆశా భావం వ్యక్తం చేశారు.















