అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగడం లేదన్నారు. రాచరిక పాలన సాగుతోందని మండిపడ్డారు. ప్రశ్నించడమే నేరంగా మారిందన్నారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. తమ న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆందోళన బాట పట్టిన అంగన్ వాడీలపై దాడులకు దిగడం దారుణమన్నారు. ప్రభుత్వానిది దౌర్జన్యకాండ పట్ల ఫైర్ అయ్యారు షర్మిలా రెడ్డి. అర్ధరాత్రి అరెస్టులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. డిమాండ్ల సాధనపై శాంతియుత నిరసన చేయడం తప్పేనా ? హక్కులు అడిగితే సంకెళ్లు వేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్.
మహిళలని చూడకుండా ఇదెక్కడి అమానుషం ? ఎన్నికలకు ముందు వాగ్దానాలు.. వాటి సంగతి అడిగితే జైళ్లు. హామీల అమలుపై ఇదేనా కూటమి ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి అంటూ నిలదీశారు షర్మిలా రెడ్డి.
అంగన్వాడీల డిమాండ్లు న్యాయ బద్ధమైనవని అన్నార. వారికి కనీస వేతనం 26 వేలు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు . గ్రాట్యూటీ అమలుకు మార్గదర్శకాలు ఇవ్వాలని షర్మిలా డిమాండ్ చేశారు. 1810 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా అప్ గ్రేడ్ చేయాలన్నారు. అంగన్వాడీలకు వేతనంతో కూడిన మెడికల్ లీవులు అమలు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న పోస్టులను భర్తీ చేయడంతో పాటు ఇతర డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. 2023 డిసెంబర్ లో 42 రోజుల సమ్మె సందర్భంగా ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. హక్కుల సాధనకై అంగన్వాడీల ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని అన్నారు షర్మిలా రెడ్డి.
