అమరావతి : ఏపీ సీఎం కీలక ప్రకటన చేశారు. ఏపీని పర్యాటక హబ్ గా మారుస్తామన్నారు. రాష్ట్రంలో పురాతన కట్టడాలు చాలా ఉన్నాయని, వాటికి ఎంతో చరిత్ర ఉంటుందని, వాటిని ఎంకరేజ్ చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల హోటల్ గదులు సిద్ధం కావాలని ఆదేశించారు. వివిధ ప్రాంతాల్లో హోమ్ స్టేలు పెద్ద ఎత్తున రావాలన్నారు. కన్వెన్షన్ సెంటర్లు, మైస్ సెంటర్లు నిర్మాణం చేయాలన్నారు. యుద్ధ ప్రభావాల నేపథ్యంలో విదేశాల కంటే స్థానికంగా ఉండే పర్యాటకానికి పెద్దఎత్తున ఆకర్షణ పెరుగుతుందని చెప్పారు సీఎం. దేవాలయాలు పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు… మానసిక ఉల్లాసాన్ని కలిగించే ప్రాంతాలని, వాటిని అభివృద్ధి చేయాలన్నారు. పాపికొండలు, గండికోట భారత్ కే గ్రాండ్ కాన్యన్, సూర్యలంక మరో గోవాగా తయారవుతుందని చెప్పారు సీఎం.
జిల్లాల వారీగా ఆయా ప్రాంతాల్లో ఉన్న పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలని అన్నారు. టూరిజం ఎక్స్ పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయటంతో పాటు మాన్యుమెంట్లను కూడా అభివృద్ధి చేయాలన్నారు. తిమ్మమ్మ మర్రిమాను వద్ద మౌలిక సదుపాయాలు కల్పిస్తే మంచి పర్యాటక ప్రాంతంగా మారుతుందని పేర్కొన్నారు. కంభం చెరువు ఆసియాలోనే అతిపెద్ద మానవ నిర్మిత నీటి వనరు అని పేర్కొన్నారు. పులికాట్ సరస్సులో పర్యాటక ప్రాజెక్టును ప్రతిష్టాత్మక కంపెనీలకు అప్పగించి అభివృద్ధి చేయాలన్నారు. స్థానికుల్ని ఈ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం చేయటం ద్వారా వేగంగా అభివృద్ధి జరుగుతుందన్నారు.
జాతీయ రహదారులపై వే సైడ్ అమెనిటీస్, ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, నైట్ హాల్ట్ కోసం గదులు నిర్మాణం చేపడితే పెట్టుబడులు వస్తాయని చెప్పారు సీఎం. ఏపీఐఐసీ ద్వారా చేసే ల్యాండ్ అలాట్మెంట్ లో 5 ఎకరాల వరకూ కేటాయింపులు చేసేలా జిల్లా కలెక్టర్లకు ఆథరైజేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు.. విజయవాడలోని డిస్నీల్యాండ్, భవానీ ఐ ల్యాండ్ లను పర్యాటకంగా అభివృద్ధి చేద్దాం అన్నారు. అమరావతిలో క్రియేటివ్ సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సీఎం. అమరావతిలో కంటెంట్ క్రియేషన్ చేసే వారిని ప్రొత్సహిస్తాం అన్నారు. ఏఐ, ఫిలిం, కంటెంట్ క్రియేషన్ పరిశ్రమలకు పెద్ద పీట వేస్తాం అన్నారు. రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీ పెరిగేందుకు వీలుగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం అని తెలిపారు.
