అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో అమరావతి వైపు యావత్ ప్రపంచం చూసేలా చేస్తానని అన్నారు. మంగళవారం రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేకంగా తయారు చేసిన క్వాంటం విజన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఏపీ భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న క్వాంటం వర్క్ఫోర్స్ను నిర్మించేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పారు. రాబోయే రెండు సంవత్సరాల లోపు అమరావతిలో క్వాంటం కంప్యూటర్లు ఉత్పత్తి అవుతాయని ముఖ్యమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. క్వాంటం వ్యాలీని ఆతిథ్యం ఇచ్చే గ్రీన్ఫీల్డ్ రాజధాని నగరం అమరావతిని ప్రపంచంలోని టాప్ ఐదు క్వాంటం కంప్యూటింగ్ హబ్లలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తామని ప్రకటించారు.
వేలాది మంది విద్యార్థులను వర్చువల్గా ఉద్దేశించి ప్రసంగించారు. దక్షిణాది రాష్ట్రం నుంచి తదుపరి తరం నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి, వేలాది అధిక-విలువైన ఉద్యోగాలను సృష్టించడానికి, ఉత్పత్తి-కేంద్రీకృత విధానాన్ని అవలంబించడానికి, అన్ని రకాల క్వాంటం కంప్యూటర్లను అభివృద్ధి చేయడానికి క్వాంటం కంప్యూటర్ల తయారీలో పూర్తి సరఫరా గొలుసును సాధించడానికి కృషి చేస్తుందని నొక్కి చెప్పారు. తాము ఒకరిని అనుసరించేది లేదన్నారు. తామే చరిత్రను సృష్టిస్తామని, ఆ సత్తా తమకు ఉందని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. క్వాంటమ్ కంప్యూటింగ్ ను తయారు చేసేందుకు ప్రతి ఒక్కరు సిద్దంగా ఉన్నారని చెప్పారు.
