చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఈ ఏడాదిలో శాసన సభకు ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే ప్రస్తుతం అధికారంలో ఉంది. ఈసారి ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో పవర్ లోకి రావాలని అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. మరో వైపు టీవీకే విజయ్ కూడా ప్రధాన పోటీదారుగా మారడంతో ఎన్నికలు యుద్దాన్ని తలపింప చేస్తున్నాయి. ఈ తరుణంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే అన్నాడీఎంకే ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా తాజాగా తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. అన్ని వర్గాలను ప్రసన్నం చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఎవరూ ఊహించని రీతిలో మహిళలకే కాదు పురుషులకు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బస్సులలో కల్పిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం అన్నాడీఎంకే చేసిన ఈ ప్రకటన దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు.
భారీ ఎత్తున ఓటర్లను ఆకర్షించేందుకు ప్లాన్ చేసింది అన్నాడీఎంకే. ఈ మేరకు పురుష ఓటర్లకు గాలం వేసింది. అంతే కాకుండా మహిళలకు కూడా తీపి కబురు చెప్పింది. ప్రతి మహిళకు నెలకు రూ. 2,000 చొప్పున ఇస్తామని ప్రకటించింది. సిటీ బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపింది. అమ్మ టూ వీలర్ స్కీమ్ కింద 5 లక్షల మందికి ద్విచక్ర వాహనంపై రూ.25,000 సబ్సిడీ ఇస్తామని వెల్లడించింది. గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఉన్నవారికి కాంక్రీట్ ఇండ్ల నిర్మాణం చేపడతామని తెలిపింది. అంతే కాకుండా 100 రోజుల ఉపాధి హామీ పనుల రోజులను 150కి పెంచుతామని ప్రకటించింది అన్నాడీఎంకే.
