హైదరాబాద్ : ఈనెల 20వ తేదీన బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న మాజీ మంత్రి, ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని తిట్టడం బంద్ చేయాలని వార్నింగ్ ఇచ్చారు. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. నిన్నటి దాకా పార్టీలో సీనియర్ నాయకుడని గౌరవించామని, కానీ ఆ గౌరవాన్ని తాను ఉంచు కోవడం లేదన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, తను ఏ పార్టీకైనా వెళ్లే అధికారం ఉంటుందన్నారు.
తాను బీఆర్ఎస్ లోకి వెళ్లడం ఆయన ఇష్టమని కానీ దాని వంకతో తమ నాయకుడు, సీఎం రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని చిల్లర మాటలు మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
రేవంత్ రెడ్డిని తిడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని, కొంచెం నోరును అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు జీవన్ రెడ్డిని ఉద్దేశించి. పీసీసీ అధ్యక్షుడిగా కష్ట కాలంలో ఉన్న కాంగ్రెస్ ను కాపాడిన ఘనత తనకు దక్కుతుందన్నారు. ఆయన లేక పోయి ఉంటే తమ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది కాదన్నారు. ఇకనైనా జర జాగ్రత్త అంటూ సూచించారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
