హైదరాబాద్ : హీరోయిన్ల గురించి చులకన చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేసిన నటుడు శివాజీపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటీ నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకించి ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద, నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ నిప్పులు చెరిగారు నటుడు శివాజీని. ఈ సందర్బంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సినీ రంగానికి చెందిన 100 మందికి పైగా మహిళా ఆర్టిస్టులు ఫైర్ అయ్యారు నటుడు శివాజీపై. ఆయనపై చర్యలు తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని కోరుతూ హైదరాబాద్లోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో ఫిర్యాదు చేశారు.
దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో మహిళల వస్త్రధారణపై షాకింగ్ కామెంట్స్ చేశారు శివాజీ. అందాన్ని కాపాడు కోవడానికి మహిళలు చీరల వంటి సాంప్రదాయ దుస్తులను ధరించాలని సూచించారు. పొట్టి దుస్తులు గ్లామర్కు పరాకాష్ట కాదని, నటీమణులు తమ శరీరాలను ప్రదర్శించడం కంటే హుందాతనానికి ప్రాధాన్యత ఇవ్వాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలోని మహిళల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. దీంతో తీవ్ర వ్యతిరేకత నెలకొనడంతో శివాజీ ఎట్టకేలకు దిగి వచ్చాడు. బహిరంగ క్షమాపణలు చెప్పాడు నటుడు.


















