హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు శాసన సభ వేదికగా. ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో ఉద్యోగుల క్షేమమే తమ లక్ష్యమన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి రూ. కోటి చొప్పున ప్రమాద బీమా చెక్కులను పంపిణీ చేశారు.
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం రూ. 1.20 కోట్ల భారీ ప్రమాద బీమా పథకాన్ని తమ ప్రభుత్వం అమలు చేస్తోందని ఈ సందర్బంగా చెప్పారు సీఎం. విద్యుత్ సంస్థలు, సింగరేణి సిబ్బందితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7.57 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్ల కుటుంబాలకు ఈ పథకం కొండంత అండగా నిలుస్తుందని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థికంగా కుంగిపోయే పరిస్థితి ఏ ఒక్క తెలంగాణ బిడ్డకు రాకూడదన్నదే తమ సంకల్పం అని అన్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు సైతం సాధ్యం కాని రీతిలో, సామాజిక అంతరాలు లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ. 5 లక్షల రక్షణ కల్పించే ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ను కూడా తాము అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామన్నారు అనుముల రేవంత్ రెడ్డి.















