పాలమూరు జిల్లా : ఏసీబీ దూకుడు పెంచింది. అక్రమ ఆస్తులు, అవినీతికి పాల్పడుతున్న మహబూబ్ నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం. కిషన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఆయన తన జాబ్ ను అడ్డం పెట్టుకుని భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టాడని ఏసీబీ విచారణలో తేలింది. ఇందుకు సంబంధించి పలు చోట్ల సోదాలు చేపట్టింది. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని తేలడంతో తనపై కేసు నమోదు చేసింది ఏసీబీ. డీటీఓ కిషన్ నివాసంతో పాటు ఆయన బంధువులు, సహచరులకు చెందిన మరో 11 ప్రదేశాలలో సోదాలు చేపట్టారు అవినీతి నిరోధక శాఖ అధికారులు.
ఈ సోదాల్లో నిజామాబాదులో లహరి ఇంటర్నేషనల్ హోటల్లో 50 శాతం వాటా, 3000 చదరపు గజాల రాయల్ఓక్ ఫర్నిచర్ కలిగిన స్థలం, అశోక టౌన్షిప్లో 2 ఫ్లాట్లు, 10 ఎకరాల వాణిజ్య భూమి, సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక పాలీహౌస్, షెడ్, రెండు వాహనాలు (ఇన్నోవా క్రిస్టా , హోండా సిటీ), 1000.4 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటుగా రూ.1.37 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్ కలిగి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఆస్తులన్నింటి మొత్తం విలువ సుమారు రూ.12.72 కోట్లు ఉంటుందని దర్యాప్తులో తేల్చింది ఏసీబీ.
ఈ సందర్బంగా ఏసీబీ కీలక ప్రకటన చేసింది. ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే తక్షణమే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని కోరింది. అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలైన వాట్సాప్ ( 9440446106), ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ @TelanganaACB తో పాటు వెబ్ సైట్ (http://acb.telangana.gov.in ) ద్వారా కూడా ఫిర్యాదు చేయాలని సూచించింది.
