బెంగళూరు : కేంద్రంలోని మోదీ, బీజేపీ ప్రభుత్వ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకారులు. బెంగళూరు వేదికగా నీట్ యుజి 2026, సీబీఎస్ఈ పరీక్షలు లీక్ అయ్యాయి. దీనికి ప్రధాన కారకులు మోదీ, అమిత్ షా, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేనని ఆరోపించారు సీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు. ఓ వైపు భారీ వర్షం వస్తున్నా లెక్క చేయకుండా ఆందోళన చేపట్టారు. ప్రముఖ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కాక్రోచ్ పార్టీ నిరసనలో పాల్గొన్నారు. మద్దతు ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన నిప్పులు చెరిగారు సర్కార్ నిర్వాకంపై. మోదీ సర్కార్ కొలువు తీరిన ఈ 12 సంవత్సరాల పాలనా కాలంలో దొంగలు, లంగలు, లఫంగలు, కార్పొరేట్ శక్తులు, బడా బాబులు , మోసపూరిత వ్యాపారవేత్తలకు మద్దతు ఇస్తూ దేశాన్ని సర్వ నాశనం చేశారంటూ ఆరోపించారు నటుడు ప్రకాష్ రాజ్.
ఒక్క నీట్ యుజి పరీక్షనే కాదు అన్ని పరీక్షలను నిర్వహించడంలో కేంద్రం ఘోరంగా విఫలం అయ్యిందని, లీకులకు ప్రధాన కారకులు బీజేపీకి చెందిన వారేనని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై విచారణ చేపట్టినా ఫలితం ఉండదన్నారు. అందుకే యువత మేల్కోవాలని, తమ విలువైన ఓటును బాధ్యత కలిగిన, నిబద్దత కలిగిన వారికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని, ఇవాళ దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేనే లేదన్నారు. దేశవ్యాప్తంగా క్రమంగా దృష్టిని ఆకర్షిస్తున్న ఈ ఉద్యమానికి ప్రకాష్ రాజ్ మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారింది. పేపర్ లీక్లు ,విద్యార్థులను ప్రభావితం చేస్తున్న పరీక్షలకు సంబంధించిన సమస్యలపై జవాబుదారీతనం కోరుతూ తమ డిమాండ్లను కొనసాగించారు.
