హైదరాబాద్ : ఏకంగా రహదారిపైనే గదులు నిర్మించి కబ్జాలకు పాల్పడిన వారికి హైడ్రా గుణపాఠం చెప్పింది. 50 అడుగుల రహదారిపై అడ్డంగా గోడ కట్టి చేపట్టిన పలు నిర్మాణాలను హైడ్రా తొలగించింది. 15 ఏళ్ల సమస్యను పరిష్కరించి.. అక్కడి కాలనీ వాసులకు హైడ్రా దారి చూపింది. హైడ్రా చర్యలతో ఆర్వింద్ ఎన్క్లేవ్లో రోడ్డు పునః ప్రారంభమైంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం ఆర్వింద్ ఎన్క్లేవ్లో రోడ్డు నంబరు 4 ను ఆక్రమించి అదే మార్గంలోని ఇంటి యజమానులు నిర్మాణాలు చేపట్టారు. ఈ విషయమై జీహెచ్ ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించలేదు.
15 ఏళ్లుగా ఇబ్బంది పడుతున్నాం. 50 అడుగుల రహదారిలో ఆటంకాలు తొలగితే.. కేవలం 100 మీట్లర్లలో ప్రధాన రహదారికి చేరుకుంటామని.. ఇప్పుడు కిలోమీటరుకు పైగా తిరిగి వెళ్లాల్సి వస్తుందని అరవింద్ ఎన్క్లేవ్ కాలనీ వాసులు హైడ్రాకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్గారి ఆదేశాల మేరకు ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఇక్కడ ఆక్రమణలు తొలగడంతో హర్ష హాస్పిటల్ లేన్కు సులభంగా చేరుకుంటున్నామని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు రాకపోకలకు ఇబ్బందులు తొలగినట్టయ్యిందన్నారు. హైడ్రాఅధికారుల సత్వర స్పందన, కఠిన చర్యలపై హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
