TTD : తిరుమల – తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్ప పల్లకీ సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పాలక మండలి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నీళ్లు, మజ్జిగ, అన్న ప్రసాద వితరణ చేపట్టారు.
TTD Palanquin Service
మరో వైపు స్వామి వారిని చూసేందుకు, దర్శనం చేసుకునేందుకు , అనుగ్రహం పొందేందుకు భక్తులు బారులు తీరారు. ఇదిలా ఉండగా టీటీడీ బర్డ్ ట్రస్ట్ కు రూ 10,01,116 విరాళం అందించారు. క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడు ని కలిసి విరాళం చెక్కును అందజేశారు దాతలు ముప్పరాజు జగదీష్, కడూరు విజయలక్ష్మి. చైర్మన్ తో పాటు బోర్డు సభ్యుడు నన్నపనేని సదా శివ రావు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీటీడీ ఈవో జె. శ్యామల రావు కీలక ప్రకటన చేశారు. వచ్చే అక్టోబర్ నెలలో దర్శనానికి సంబంధించి టోకెన్ల కోటాను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 19వ తేదీ ఉదయం 10 గంటల నుండి ప్రారంభం అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని శ్రీవారి భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేవలం టీటీడీ అధికారిక వెబ్ సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని కోరారు. మధ్య దళారీలను నమ్మవద్దని హెచ్చరించారు.
Also Read : Uttam Kumar Reddy Shocking Comments : నదీ జలాల వినియోగంలో టెలిమెట్రి విధానం
