కర్నూలు జిల్లా : ఏపీ రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. బుధవారం కర్నూలు జిల్లా లో జొన్నగిరి గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు . సువర్ణ అధ్యాయానికి రతనాల సీమ రాయలసీమ కేంద్రమైందన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభించు కోవడం శుభపరిణామం అన్నారు సీఎం. విస్తరణ యూనిట్ కు శంకుస్థాపన చేసుకున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్ చేపట్టిన జియో మైసూర్ సర్వీసెస్, త్రివేణి ఎర్త్ మూవర్స్ సంస్థల యాజమాన్యానికి, ఉద్యోగులకు, కార్మికులకు అభినందనలు తెలిపారు. జొన్నగిరి ఘనత నేటిది కాదు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అని పిలిచే వారని గుర్తు చేశారు.
ఆనాటి అశోకుడి నాలుగు రాజధానుల్లో సువర్ణగిరి, ఈనాటి జొన్నగిరి అని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం బంగారం, రత్నాలతో నిండి ఉందన్నారు. ఇక్కడకు దగ్గరలో లభించిన అశోకుడి ఎర్రగుడి శాసనాలు ఈ ప్రాంత వైభవాన్ని చెబుతున్నాయని తెలిపారు. రాయలసీమ అంటేనే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయుల కాలంలో సీమలో రత్నాలు రాసులుగా పోసి అమ్మే వారన్నారు. ప్రపంచానికి కోహినూర్ వజ్రాన్ని అందించిన ఘనత మన రాష్ట్రానిదేనని చెప్పారు. కాలక్రమేనా రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితులు తలెత్తాయి. ప్రాజెక్టులు పూర్తి చేసి, సాగునీరు ఇచ్చి సీమకు మళ్లీ జీవం పోశాం. గోల్డ్ మైనింగ్ తో సీమకు పూర్వ వైభవం వస్తుందన్నారు.

















