అమరావతి : కేంద్రం సహకారంతో ఏపీ రాష్ట్రం అన్నిరంగాలలో అభివృద్ధి చెందుతోందని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కాకినాడలో ఆయన జెండాను ఎగుర వేశారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు పవన్ కళ్యాణ్. ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడితే, మరో తరం దానిని కాపాడిందని పేర్కొన్నారు. బలమైన , సమర్థవంతమైన దేశంగా అవతరించి, ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా భారత్ పయనిస్తోందని ఆయన అన్నారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారం , సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర కనబరుస్తోందన్నారు పవన్ కళ్యాణ్ కొణిదల.
ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను పవన్ కళ్యాణ్ స్మరించుకున్నారు . దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు తమ బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా ‘క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులసను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. 5,000 మంది కళాకారుల కుటుంబాలకు ముడి సరుకు కొరత సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు డిప్యూటీ సీఎం. హస్తకళల రూపంలో ఉన్న మన సాంస్కృతిక , వారసత్వ సంపదను పరిరక్షించే లక్ష్యంతో ‘క్రాఫ్ట్ వుడ్ బ్యాంకుల’ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన కేంద్ర క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును, శాసనమండలి సభ్యులు, స్థానిక ఎమ్మెల్యేలు , అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు.
హస్తకళల తయారీలో ప్రధాన ముడి సరుకైన ‘కలాప్’ (మృదువైన చెక్క) కొరత నుండి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం రాజమహేంద్రవరం కేంద్ర క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులో కళాకారుల కోసం 30 క్యూబిక్ మీటర్ల కలాప్ అందుబాటులో ఉంచబడింది. రాబోయే ఐదేళ్లకు సరిపడా కలాప్ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
















