Auto Exports : 2025 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత (India) ఆటోమొబైల్ రంగం ఉత్సాహకర ఫలితాలు నమోదు చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో ఆటోమొబైల్ ఎగుమతులు 22 శాతం పెరిగాయని భారత ఆటోమొబైల్ తయారీదారుల సమాఖ్య (సియామ్) వెల్లడించింది. ఈ ముగ్గురు నెలల్లో మొత్తం ఎగుమతులు 14,57,461 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 11,92,566 యూనిట్లుగా ఉంది.
Auto Exports – ప్రధాన ఎగుమతి వర్గాలు:
ఈ వృద్ధికి ప్రధానంగా ప్యాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాలు మరియు వాణిజ్య వాహనాల విభాగాల్లో నమోదైన గణనీయమైన పెరుగుదల కారణమని సియామ్ పేర్కొంది.
- ప్యాసింజర్ వాహనాలు: 2,04,330 యూనిట్లు
- ద్విచక్ర వాహనాలు: 11,36,942 యూనిట్లు
- వాణిజ్య వాహనాలు: 19,427 యూనిట్లు
- మూడు చక్ర వాహనాలు: 95,796 యూనిట్లు
ఈ వృద్ధికి అమెరికా, మధ్యప్రాచ్య దేశాలలో స్థిరమైన డిమాండ్, అనుకూల ఎగుమతి పరిస్థితులు దోహదం చేశాయి.
అగ్రస్థానంలో మారుతి సుజుకీ
దేశీయంగా ఆటో ఎగుమతుల్లో మారుతి సుజుకీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. జూన్ త్రైమాసికంలో సంస్థ 96,181 ప్యాసింజర్ వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది. ఇతర సంస్థలు కూడా గణనీయమైన ఎగుమతులు నమోదు చేసినప్పటికీ, మారుతి సుజుకీ ఎగుమతుల పరంగా ముందంజలో ఉంది.
హోండా భవిష్యత్తు లక్ష్యాలు
హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) సంస్థ 2030 నాటికి దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో తన వాటాను 30 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 27 శాతం మార్కెట్ వాటాతో రెండో స్థానంలో ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో హోండా 47.89 లక్షల ద్విచక్ర వాహనాలను విక్రయించగా, హీరో మోటోకార్ప్ 54.45 లక్షల యూనిట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది.
ఆటో రంగం దేశీయంగా మాత్రమే కాకుండా గ్లోబల్ మార్కెట్లలోనూ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. విదేశీ డిమాండ్ పెరుగుతున్న సందర్భంలో భారత ఆటోమొబైల్ తయారీదారులు ఎగుమతుల్లో మరింత పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : Toll Tax Free : ఇకపై వారికి నో టోల్ ట్యాక్స్



















