CM Revanth Reddy : ఢిల్లీ – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగాన్ని పర్యవేక్షించడానికి యుద్ధ ప్రాతిపదికన టెలిమెట్రీ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (Union Minister CR Patil) సమక్షంలో జరిగిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం నిర్ణయించింది. ఈ కీలక భేటీలో నాలుగు అంశాలపై ఒక నిర్ణయానికి వచ్చామని సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. ఇరు రాష్ట్రాల మధ్య నాలుగు అంగీకారం కుదిరినట్టు తెలిపారు. నదీ జలాల విషయంలో రాష్ట్రం వెలిబుచ్చిన అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని టెలిమెట్రీ విధానం అమలు చేయాలని తెలంగాణ ఎప్పటి నుంచో అడుగుతోందని, అందుకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించిందని చెప్పారు.
CM Revanth Reddy Full Focus
నదీ జలాల్లో అన్ని పాయింట్స్ లో టెలిమెట్రీ విధానాన్ని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయడానికి అంగీకారం కుదరడం తెలంగాణ విజయంగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. నదీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాలు ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ వినియోగిస్తున్నారని పరిశీలించడానికి టెలిమెట్రీ విధానం సరైనదని తాను ఇప్పటికే స్పష్టం చేశానని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో ఈ అంశం ఉన్నప్పటికీ ఇంతకాలం అమలు జరగ లేదన్నారు. విభజన చట్టంలో పేర్కొన్నట్టుగానే గోదావరి నది యాజమాన్య బోర్డు తెలంగాణ నుంచి, కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ నుంచి పనిచేయాలన్న అంశంపై అంగీకారం కుదిరిందని స్పష్టం చేశారు. గతంలో జరిగిన ఎపెక్స్ కమిటీ సమావేశంలోనే దీనిపై నిర్ణయం తీసుకున్నా అమలు జరగలేదని ఆరోపించారు.
ప్రతిష్టాత్మకమైన శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి నిపుణులు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారుల సూచనల మేరకు ప్లంజ్ పూల్ తో పాటు అవసరమైన మరమ్మత్తులు చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించిందన్నారు. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణ, గోదావరి నదులు, వాటి ఉప నదుల నీటి వినియోగంపై అపరిష్కృతంగా ఉన్న అంశాలపై సీనియర్ అధికారులు, నిపుణులతో కూడిన ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు సీఎం.
Also Read : UPI Service Block Shocking : 4 రోజులు యూపీఐ సర్వీసులు నిలిపివేస్తున ఆ బ్యాంకులు
















