న్యూఢిల్లీ : తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొనసాగుతూ వస్తున్న ఉత్కంఠకు తెర పడింది. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖకు బిగ్ షాక్ ఇచ్చింది కాంగ్రెస పార్టీ హైకమాండ్. తన కూతురు సంచలన ఆరోపణలు చేసింది సీఎం రేవంత్ రెడ్డిపై, ఆయన తమ్ముళ్లపై. మరో వైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన తనను ఎలా తొలగిస్తారంటూ కొండా సురేఖ ప్రశ్నించింది. ఇదే సమయంలో ఆమె ఢిల్లీలో పర్యటించారు. పార్టీ హైకమాండ్ తో కీలక సమావేశం లో ఆమె పాల్గొన్నారు. తన వైపు నుంచి కూడా వాదనలు వినిపించారు గట్టిగా. ఈ భేటీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరయ్యారు.
ఇదిలా ఉండగా గురువారం సంచలన ప్రకటన చేసింది పార్టీ హైకమాండ్. తక్షణమే కొండా సురేఖ రాజీనామా చేయాలని ఆదేశించింది. సాయంత్రం లోపు రాజీనామా సమర్పించాలని , లేక పోతే లోక్ భవన్కు తొలగింపు లేఖ పంపబడుతుందని హెచ్చరించింది. ఢిల్లీ నుండి రేవంత్ రెడ్డి వచ్చే సమయానికి ఆమె రాజీనామా చేసే అవకాశం ఉంది. తొలగించ బడటం కంటే రాజీనామా చేయడమే మేలని కొండా సురేఖ నిర్ణయం తీసుకున్నట్లు టాక్. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే తొలగించాల్సి వస్తుందని, ఆ పరిస్థితి వచ్చేలా వ్యవహరించ వద్దని ఖర్గే సూచించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
పునరాలోచించాలన్న విజ్ఞప్తిని కొండా సురేఖ పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా మంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీలో కొనసాగడం అవమానకరమని భావిస్తున్న కొండా సురేఖ, పార్టీకి కూడా రాజీనామా చేయాలని ఆలోచిస్తున్నారు.
















