ముంబై : నేషనల్ క్రష్ , ప్రముఖ సినీ హీరోయిన్ రష్మిక మందన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రత్యేకంగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఇరుముడి సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సోషల్ మీడియా వేదికగా తన స్పందనను తెలియ చేశారు. తనకు ఇరుముడి చిత్రాన్ని చూసే చాన్స్ దక్కిందన్నారు రష్మిక మందన్నా. ఎంత అద్భుతమైన సినిమా ఇది. ఇది నా మనసును ఊహించని రీతిలో తాకింది . సాధారణంగా చిన్న పట్టణాల్లో పెరిగినప్పుడు, ఏదైనా జరిగినప్పుడు లేదా ఏదైనా మనల్ని బాధ పెట్టినప్పుడు, మనలోని అమాయకత్వం వల్ల మనం మొదట పెద్దలకు ఆ విషయం చెబుతాం.. కానీ ఆ తర్వాత వాస్తవం మనకు అర్థమవుతుంది.. పరిస్థితులు ఏవైనా సరే, మౌనంగా ఉండమని మనకు చెబుతారు..
ఈ సినిమా ఒక అద్భుతమైన ఆశ్చర్యాన్ని కలిగించింది, అలాగే తప్పక చర్చించాల్సిన ఒక ముఖ్యమైన అంశాన్ని ఇది తెలియ జేస్తుందని పేర్కొంది నటి రష్మిక మందన్నా. ప్రత్యేకంగా దర్శకుడికి, అద్భుతంగా నటించిన మాస్ మహారాజా రవితేజకు అభినందనలు తెలియ చేస్తున్నానని తెలిపింది. ఈ విజయానికి మీకు నా హృదయ పూర్వకమైన శుభాకాంక్షలు. ఇక ఇరుముడిలో ప్రతి ఒక్కరు ఒదిగి పోయారు. కానీ నన్ను ఎక్కువగా ఆకట్టుకున్నది మాత్రం నక్షత్ర అని తెలిపింది.. ఈ సినిమాలో మీరు ఒక వెలుగురేఖలా నిలిచారు. మీ చిరునవ్వు నా ముఖంలోనూ చిరునవ్వును పూయించింది అని ప్రశంసించింది. ఈ విజయం మీకు పూర్తిగా దక్కాలి, నిజంగా మీరు దీనికి అర్హులు.. మీ గురించి చాలా సంతోషంగా ఉందన్నారు.


















