హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సర్కార్ పై. అధికారం కోసం కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని నిరాధారమైన ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా కాళేశ్వరంపై రేవంత్ ప్రభుత్వం పన్నిన కుట్రలు మరోసారి బట్టబయలు అయ్యాయని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణ నాణ్యతలో ఎలాంటి లోపాలు లేవని కేంద్ర జల వనరుల సాధికారక సంస్థ ( సీడబ్ల్యూపీఆర్ఎస్ ) ధ్రువీకరించిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుప్పకూలి పోయిందని, విఫలమైందని రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం దుర్మార్గమైనదని తేలి పోయిందన్నారు హరీష్ రావు. కేసీఆర్కు మంచి పేరు వస్తుందన్న ఏకైక కారణంతో ప్రాజెక్టును కావాలనే దెబ్బ తీయాలన్న వారి కుట్ర పూరిత ఉద్దేశం బయట పడిందన్నారు. గత రెండేళ్లన్నర కాలంగా రాష్ట్ర ప్రజలకు సాగు, తాగునీరు అందించకుండా ప్రభుత్వం అనుసరించిన ద్వంద్వ వైఖరి కూడా వెలుగులోకి వచ్చిందన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బ తీయడానికి కాంగ్రెస్ పార్టీ పన్నిన నీచమైన రాజకీయ కుట్ర ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చిందన్నారు. రెండేళ్లన్నర పాటు కాంగ్రెస్ ఆడిన దుర్మార్గపు నాటకాన్ని ఎండగడుతూ.. కాళేశ్వరం బ్యారేజీ నిర్మాణాల నాణ్యతలో ఎలాంటి లోపాలు లేవని సెంటర్ ఫర్ వాటర్ & పవర్ రీసెర్చ్ స్టేషన్ స్పష్టం చేసిందన్నారు. అంతే కాకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని, కేవలం మేడిగడ్డ బ్యారేజీలోని ‘బ్లాక్-7’లో మాత్రమే స్వల్ప లోపాలు గుర్తించినట్లు ఆ నివేదిక వెల్లడించిందని పేర్కొన్నారు హరీష్ రావు. దీంతో ప్రభుత్వం చేస్తున్న ప్రచారమంతా అవాస్తవమని రుజువైందన్నారు.

















