అమరావతి : ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు నీటి పారుదల రంగంలో చోటు చేసుకున్న సమస్యల గురించింది. పలువురు శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. యల్లసిరి కెనాల్ పనులు, ఏలేరు జలాశయం పరిధిలోని ఆయకట్టుకు నీటి సరఫరాపై సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సమస్యలను పరిష్కరించడానికి సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ల సూచనల మేరకు అధికారులు, స్దానిక ఎమ్మెల్యేలతో కలసి క్షేత్రస్దాయిలో పరిశీలించడం జరిగిందన్నారు . పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేలోపు ఏలేరు ఆయకట్టుకు నీరివ్వాలనే లక్ష్యంతో నాడు చంద్రబాబు పురుషోత్తమపట్నం లిఫ్ట్ స్కీం ను నిర్మించారని చెప్పారు నిమ్మల రామానాయుడు.
సూపర్ ఎల్ నినో వంటి క్లిష్టపరిస్దితుల్లో కూడా 53 వేల ఎకరాల ఏలేరు ఆయకట్టు, 1.48 లక్షల ఎకరాల పుష్కర ఆయకట్టుకు సాగు, తాగు నీరందిస్తున్నామని, ఇది కేవలం సీఎం చంద్రబాబు ముందు చూపు వల్లే సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వం ఉత్తరాంధ్రకు సాగు, తాగు నీరందించే పోలవరం ఎడమ కాలువ పనుల్లో తట్టమట్టి పని కూడా చేయలేదని ఆరోపించారు. కానీ కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత నీటి పారుదల రంగంపై ఫోకస్ పెట్టామన్నారు నిమ్మల రామానాయుడు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళ లోనే 1800 కోట్లు ఖర్చు చేశామని అత్యంత క్లిష్టమైన పంపా, తాండవ, ఏలేరు నదులతో పాటు, 11 హైవే క్రాసింగ్ వంతెనల పనులు పూర్తి చేశామన్నారు.
పురుషోత్తమపట్నం లిఫ్ట్ తో పాటు, పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేయడం వల్లనే ఏలేరు ఆయకట్టుకుకు సాగు, తాగు నీరిస్తున్నాం అన్నారు నిమ్మల రామానాయుడు. ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు సాగునీటి అవసరాల కోసం 950 క్యూసెక్కులను పంపిణీ చేస్తున్నాం అని చెప్పారు. ఏలేరు ఆయకట్టుకు ఇప్పటి వరకు 2.6 టిఎంసిల నీటిని పంపిణీ చేశామన్నారు. 5 ఏళ్ళ గొడ్డలి పార్టీ పాలనలో ఏలేరు నదీ గర్బంలో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల, బెడ్ లెవల్ పడిపోవడంతో గ్రావిటీ ద్వారా నీరివ్వలేని పరిస్దితి నెలకొందన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ళలోనే ఏలేరు రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో 548 పనుల కోసం 25 కోట్లు ఇచ్చాం అన్నారు.
















