అమరావతి : ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత సర్కార్ ఐటీ రంగాన్ని కేవలం ప్రచారం కోసం వాడుకుందన్నారు. కానీ కూటమి సర్కార్ వచ్చాక సీన్ మారిందన్నారు. ఇవాళ భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని ఇందుకు నిదర్శనం విశాఖ జిల్లా అని పేర్కొన్నారు శాసన సభలో. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ గూగుల్ శంకుస్థాపనకు వచ్చినపుడు ఇక విశాఖపట్నం కాదు. ఎఐ పట్నంగా మారబోతోంది అని చెప్పారన్నారు. విశాఖ గేట్ వే ఆఫ్ ఇండియా ఎఐ ఎకో సిస్టమ్ మార్చడం మా కమిట్మెంట్ అని ప్రకటించారు. దీంతోపాటు రియల్ ఎస్టేట్ వారు జిసిసిలు, ఐటి సెజ్ లు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. మరో ముఖ్యమైన విషయం ఒక అమెరికన్ యూనివర్సిటీ ఎఐ రిలేటెడ్ సబ్జెక్ట్ తో విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నారని ప్రకటించారు నారా లోకేష్. ఆ పేరు ఇప్పుడు చెప్పడం ఒప్పందం ప్రకారం కుదరదు కనుక చెప్పడం లేదన్నారు.
కావాలని కొందరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎక్కడా పర్యావరణ ఉల్లంఘనలు చేయడం లేదన్నారు లోకేష్. కొంతమంది కావాలని దొంగ వీడియోలు తీసుకొచ్చి ఏదో అయిపోతుందని చెప్పే మాటలను పట్టించు కోవద్దన్నారు. స్టాన్ఫోర్డ్ వర్సిటీ సమీపంలో పోలో వోల్టో డేటా సెంటర్ స్వయంగా చూశాను. కనీసం అక్కడ ఉన్నట్లు కూడా మాకు తెలియలేదు. దయచేసి విశాఖప్రజలు దుష్ప్రచారం నమ్మవద్దు, మేం పట్టుదల, కమిట్ మెంట్ తో పనిచేస్తున్నాం అన్నారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో డేటా సెంటర్ మన గడ్డపై ఉండాల్సిన అవసరం చాలా ఉందన్నారు. కొత్తగా ఎఐ స్మార్ట్ ఫోన్లు, డివైజ్ లు వస్తున్నాయని వెల్లడించారు. ఆ డేటా అంతా ఎఐ డేటా సెంటర్ లో స్టోర్ అవుతుందని చెప్పారు ఐదేళల్లో ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మారబోతున్నాయని పేర్కొన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కష్టపడి పెట్టుబడులు తీసుకు వస్తున్నాం అన్నారు. అపోహలు అస్సలు నమ్మొద్దు. ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ లో రెన్యువబుల్ ఎనర్జీ వాడి గ్రీన్ స్టీల్ తయారు చేస్తున్నారని తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేటప్పుడు భూమిని చదును చేయాల్సి ఉంటుందన్నారు. దానిని ప్రకృతి విధ్వంసం అనడం ఎంతవరకు న్యాయమో ప్రజలు ఆలోచించాలన్నారు లోకేష్. పనులు జరిగే సమయంలో ప్రకృతిపై కొంత భారం ఉంటుందన్నారు. దానిని కనీస స్థాయిలో తగ్గించేందుకు ఒక కార్యాచరణ పెట్టుకొని మేం పని చేస్తున్నాం అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
















