అమరావతి : జనసేన పార్టీ కీలక ప్రకటన చేసింది. జనసేన పార్టీ నిర్మాణ ప్రక్రియ కోసం చేపట్టిన జనసేన నిర్మాణ సారధుల సమాచార సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా ప్రారంభమైంది. ఈ సమాచార సేకరణ నిమిత్తం ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక కమిటీని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. ప్రతి కమిటీకి ఒక ఎంపీ/ఎమ్మెల్సీ/ఎమ్మెల్యే/కార్పొరేషన్ ఛైర్మన్/ సీనియర్ నాయకుడిని పరిశీలకుడిగా నియమించారు. పార్టీ కోసం బలంగా నిలబడ్డ క్షేత్ర స్థాయి నాయకులు, శ్రేణులు- తాము ఆశించే పదవుల వివరాలను తెలియచేస్తూ కమిటేకి దరఖాస్తు సమర్పిస్తున్నారు. ఈ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ లెవల్ నుంచి పార్లమెంట్ లెవల్ వరకు పార్టీ కోసం పని చేయడానికి, బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నవారు సమాచార సేకరణ కమిటీలు వద్దకు వచ్చి దరఖాస్తులను అందజేస్తున్నారు.
ప్రత్యేకంగా మూడు డెస్క్ లు ఏర్పాటు చేసి ఎక్కడా ఏ సమాచారం మిస్ కాకుండా ప్రతి దరఖాస్తును భద్రపరుస్తున్నారు. వీరికి కేంద్ర కార్యాలయం నుంచి ఐదు మంది సభ్యులతో కూడిన బృందం సహాయ సహకారాలు అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సమాచార సేకరణ కమిటీలకు తగిన విధంగా సమన్వయం చేసేందుకు కేంద్ర కార్యాలయం నుంచి ఐదు మందితో కూడిన ప్రత్యేక సమన్వయకర్తల బృందం నిరంతరం జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. మొదటి రోజు ఉత్సాహ భరిత వాతావరణంలో మొదలైన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలతో కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం చేసేందుకు అయిదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది.
















