అమరావతి : ప్రజా ప్రభుత్వంలో తిరుపతికి మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ రానుంది. మైసూరుకు చెందిన జేఎస్ఎస్ మహా విద్యాపీఠం ఆధ్వర్యంలో తిరుపతిలో జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్-క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏపీ ఉన్నత విద్యామండలి జేఎస్ఎస్ సంస్థ శ్రీ శివరాత్రీశ్వర మహావిద్యాపీఠం) మహా విద్యాపీఠంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, జేఎస్ఎస్ మహా విద్యాపీఠం టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, జేఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ ప్రో ఛాన్స్ లర్ డా.బి.సురేష్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం తిరుపతిలో జేఎస్ఎస్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఆఫ్ -క్యాంపస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు.
మైసూరు హెడ్ క్వార్టర్ గా ఉన్న జేఎస్ఎస్ ఏహెచ్ఈఆర్ నాక్ నుంచి A++ గుర్తింపు పొందిన డీమ్డ్ విశ్వ విద్యాలయంగా గుర్తింపు పొందింది. ఎన్ఐఆర్ఎఫ్ 2025 ర్యాంకింగ్స్లో విశ్వ విద్యాలయాల విభాగంలో 21వ స్థానం, ఒవరాల్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో 38వ స్థానాన్ని దక్కించుకుంది. 70 ఏళ్ల చరిత్ర కలిగిన జేఎస్ఎస్ విద్యాసంస్థకు ఇది ప్రధాన విద్యాసంస్థగా ఉండగా.. భారత్తో పాటు విదేశాల్లో 300కు పైగా విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా ప్రతిపాదిత క్యాంపస్ లో ఐదు సమగ్ర విద్యా పాఠశాలలను ఏర్పాటు చేయనుంది జేఎస్ఎస్ సంస్థ. ఇందులో భాగంగా 74 కోర్సులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్.
















