విశాఖపట్నం : ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ పై సీరియస్ అయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు చావు బతుకుల్లో ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికే మృతి చెందిన కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 25 లక్షలు, గాయపడిన కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన నారా లోకేష్ కార్మిక సంఘాల నేతల పట్ల దురుసుగా వ్యవహరించారు. ఆపై వారిని చులకన చేసి మాట్లాడటం కలకలం రేపింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సంఘాల నేతలు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేసింది.
ఇదిలా ఉండగా కార్మికులు, వారి కుటుంబాలు, కార్మికుల సంక్షేమం తరపున వాయిస్ వినిపిస్తూ వస్తున్న కార్మిక సంఘాల నేతలను అగౌరవ పరిచేలా మాట్లాడిన నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కుక్కను తీసుకొచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే ఇలాంటి ప్రవర్తనే ఉంటుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ప్రవర్తించిన తీరు అత్యంత జుగుస్సాకరంగా ఉందన్నారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్రమాద బాధితుల తరపున ప్రశ్నించిన నాయకులను ఉద్దేశించి ‘మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా?’ అనడం నియంతృత్వ ధోరణికి, అహంకారానికి నిదర్శనమన్నారు. తప్పులు బయట పడతాయనే భయంతోనే వారిలో ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోందని విమర్శించారు.


















