అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా సంచలనంగా మారిన , ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి అవాకులు చెవాకులు పేలిన మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై భగ్గుమన్నారు. ఆయనకు సోయి లేదన్నారు సోము వీర్రాజు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక మేధావి కానే కాదన్నారు. ఆయన తనంతకు తానుగా మేధావినని ప్రకటించు కున్నారని, సభ్య సమాజం దానిని హర్షించన్నారు. ఇదే సమయంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ గడ్డం పెంచుకున్న ఒక తీవ్రవాదితో పోల్చారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు.
ఆయన బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక తీవ్రవాది, ఒక నక్సలైటు అని సంచలన ఆరోపణలు చేశారు. కమ్యూనిజాన్ని కాపాడు కోలేక, టీవీల ముందు కూర్చుని వాగుతుంటాడని మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో మేము PDP పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నామని నాగేశ్వరరావు నన్ను ప్రశ్నించారు; దానికి నేను, అవసరమైతే ఓవైసీతో నైనా పొత్తు పెట్టుకుంటామని ఆయనకు బదులిచ్చానని చెప్పారు. చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలని ప్రొఫెసర్ కు హితవు పలికారు సోము వీర్రాజు. ఇంకోసారి ఆధారాలు లేకుండా మాట్లాడితే బాగుండదన్నారు. తన పనేదో తాను చేసుకుంటే ఎవరూ ఏమీ అనరన్నారు.


















