న్యూఢిల్లీ : ఒక వ్యక్తి నడుపుతున్న ‘బొద్దింకల జనతా పార్టీ’ గొంతు నొక్కడానికి ప్రభుత్వం కఠినమైన నిఘా చట్టాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు, దిగ్గజ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ రంగంలోకి దిగి తాను ఒక గౌరవనీయమైన బొద్దింకనని బహిరంగంగా ప్రకటించారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ దేశ వ్యాప్తంగా కలకలం రేపాయి. అధికార వర్గం అభద్రతాభావంతో ఎంతగా కుంగి పోయిందంటే, ఒక హాస్యాన్ని డిజిటల్గా హత్య చేయడానికి ప్రయత్నించింది. కానీ దానికి బదులుగా, వారు తెలియకుండానే దేశ యువతకు నిరసన తెలిపే ఒక జాతీయ చిహ్నాన్ని అందించారు. ఇదిలా ఉండగా సోనమ్ వాంగ్చుక్ ‘బొద్దింక’ ఆన్లైన్ నిరసన ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నారు. యువత సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని వాదిస్తూ, భారతదేశంలో డిజిటల్ అసమ్మతిని అణచి వేయవద్దని హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ లోని లడఖ్ భవన్ లో సోనమ్ వాంగ్ చుక్ మీడియాతో మాట్లాడారు. దీనిని ప్రజాస్వామ్య ప్రతిస్పందనకకు సంబంధించిన సృజనాత్మక రూపంగా చూస్తున్నారు. నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీకేజీలు వంటి యువత లేవనెత్తిన ఆందోళనలను ప్రభుత్వం పరిష్కరించాలని వాంగ్చుక్ కోరారు. నేపాల్లోని రాజకీయ అశాంతితో పోల్చారు. ఆన్ లైన్ అసమ్మతిని అణచి వేయవద్దని మోదీ సర్కార్ కు చురకలంటించారు. యువత శాంతియుతంగా ఉండాలని సూచించారు. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి యువత గొంతుక ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. ‘బొద్దింక జనతా పార్టీ’ (CJP) అని స్వయంగా పిలుచుకునే సంస్థ నేతృత్వంలోని ఆన్లైన్ ‘బొద్దింక’ ఉద్యమానికి మద్దతు తెలిపారు.
















