అమరావతి : ఈ ఏడాది డిసెంబర్ నాటికి రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రైల్వే ప్రాజెక్టులపై మంత్రి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ సమీక్ష చేపట్టారు. 2026 డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలనే లక్ష్యంతో, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని రైల్వే ఉన్నతాధికారులతో నిర్వహించిన 4 వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో బీసీ జనార్థన్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులపై మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షా సమావేశంలో 3 వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సాధించిన పురోగతిని మంత్రి ప్రాజెక్టుల వారీగా సమీక్షించారు..
రాష్ట్రంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న R0B/RUB లను వేగవంతం చేయాలని రైల్వే అధికారులను మంత్రి ఆదేశించారు.. రాష్ట్రంలో మంజూరైన అన్ని రైల్వే మార్గాలకు భూసేకరణ త్వరగా పూర్తి చేయాల్సిందిగా స్పష్టం చేశారు బీసీ జనార్దన్ రెడ్డి. ఆయా రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ భూసేకరణ సమస్యలను జిల్లాల వారీగా జాయింట్ కలెక్టర్ లతో నెల వారీ సమీక్షా సమావేశాలు నిర్వహించి పరిష్కరించు కోవాలని మంత్రి సూచించారు. కోటిపల్లి – నర్సాపురం, నడికుడి – శ్రీ కాళహస్తి, భద్రాచలం – కొవ్వూరు, కడప – బెంగళూరు రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కాస్ట్ షేరింగ్ విధానంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రితో చర్చించి నిర్ణయిస్తామని మంత్రి తెలియజేశారు.. అదే సమయంలో రాజధాని అమరావతి పరిధిలోని నంబూరు – అమరావతి రైల్వే లైన్ కు సంబంధించి భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని CRDA అధికారులతో మాట్లాడాలని అధికారులకు మంత్రి సూచించారు.
విశాఖ చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో మంచి నీటి పైప్ లైన్ షిప్టింగ్ పనులు వేగవంతం చేయాలని అన్నారు. బేతంచెర్ల, నంద్యాలలో రైల్వే సబ్ వే ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా రైల్వే అధికారులను ఆదేశించారు.. నిర్మాణంలో ఉన్న అన్ని రైల్వే ప్రాజెక్టులను 2026 డిసెంబర్ లోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాల్సిందిగా స్పష్టం చేశారు బీసీ జనార్దన్ రెడ్డి.

















