తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిరోజూ ప్రపంచ నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం తదితర సదుపాయాలను కల్పిస్తోంది. భక్తులు దర్శనానికి ముందు స్నానమాచరించి పవిత్రంగా స్వామివారి దర్శనానికి వెళ్లడం ఆనవాయితీ కావడంతో, భక్తుల ఆచారాలు , మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తిరుమల, తిరుపతిలో అనేక వసతి గదులు, యాత్రికుల వసతి సముదాయాలను టీటీడీ నిర్మించింది.
తిరుమలలో వసతి గదులు పొందదలచిన భక్తులు సీఆర్వో జనరల్ కౌంటరులో ఆధార్ కార్డు, ఫోన్ నంబరు తదితర వివరాలను నమోదు చేసుకోవాలి. అనంతరం కేటాయించబడిన గది నంబరు, ఆ ప్రాంత వివరాలు ఎస్ఎంఎస్ ద్వారా భక్తులకు పంపబడతాయి. భక్తులు సంబంధిత ఉప విచారణ కార్యాలయంలో యూపీఐ/కార్డు ద్వారా చెల్లింపు చేసి గదిని పొందవచ్చు అని తెలిపింది టీటీడీ. తిరుమలలో స్థలాభావం కారణంగా 7800 వసతి గదులు మాత్రమే అందుబాటులో ఉన్నందున, కుటుంబాలతో వచ్చిన భక్తులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని పేర్కొంది. ఒంటరి, అవివాహిత స్త్రీ, పురుష జంటలకు గదుల కేటాయించడం లేదని తెలిపింది.



















