బీహర్ : బీహార్లో రాష్ట్రంలోని నలంద ఆలయంలో తొక్కిసలాట మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఊపిరి ఆడక ఎనిమిది మంది భక్తులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇంకా ఎంత మంది చని పోయారనే దానిపై క్లారిటీ లేదు. ఆలయంలో పూజలు చేసేందుకు భారీ సంఖ్యలో భక్తులు గుమిగూడారు. శీతలా ఆలయం వద్ద జరిగిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో మహిళలు ఉన్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి మరింత విషమంగా ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా ప్రతి మంగళవారం మాదిరిగానే ఈ రోజు కూడా మఘ్దా ఆలయం వద్ద ఒక జాతర జరుగుతోంది. ఆ ప్రాంతంలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగి పోవడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. ఈ, దీప్నగర్ పోలీస్ స్టేషన్ల అధికారులు, బీహార్ షరీఫ్ సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా, ఆలయం చుట్టుపక్కల జాతరలో ఏర్పాటు చేసిన దుకాణాలను మూసి వేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ జరపాలని బీహార్ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ఉప ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి తీవ్ర సంతాపం తెలిపారు. ఘటన తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. బాదితులకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలని సూచించారు.



















