తిరుపతి : తిరుపతిలో కొలువు తీరిన, కోరిన కోర్కెలు తీర్చే దైవంగా భక్తులు భావించే శ్రీ కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మూత్సవాలు అంరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రాత్రి 7 గంటలకు స్వామివారు గజ వాహనంపై విహరించారు. భక్తులను మంత్ర ముగ్ధులను చేశారు స్వామి వారు. గజరాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా స్వామి వారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు.
హైందవ సనాతన ధర్మంలో గజ వాహనానికి విశిష్ట ప్రాధాన్యత ఉంది. రణరంగంలో గానీ, రాజదర్బారుల్లో గానీ, ఉత్సవాల్లో గానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహన సేవలో గజేంద్రుడు కోదండ రాముల వారిని వహించునట్లు భక్తులు సదా కోదండ రాముని హృదయ పీఠికపై వహించి స్వామి కృపకు పాత్రులు కాగలరు.
ఈ వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తుల రాకను పురస్కరించుకుని ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బా రాయుడు సారథ్యంలో.


















