నంద్యాల జిల్లా : ఉగాది బ్రహ్మోత్సవాలకు శ్రీశైలం పుణ్య క్షేత్రం సిద్దమైంది. ఈ సందర్బంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షారాణ్. 1800 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ ద్వారా పరిస్థితిని పర్యవేక్షించాలని పేర్కొన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా విధులు నిర్వహించాలని స్పష్టం చేశారు. భక్తులు సంయమనం పాటిస్తూ సహకరించాలని కోరారు. ఇదిలా ఉండగా ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏర్పాట్లపై ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. బందోబస్తుకు వచ్చిన సిబ్బందిని ఎనిమిది సెక్టార్లుగా విభజించడం జరిగిందని చెప్పారు. ప్రతి సెక్టార్ కు ఒక ఉన్నతాధికారిని నియమించి నిరంతరం పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు.
శ్రీశైలంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు మొబైల్ వాహనాలను ఏర్పాటు చేయడంతో పాటు నిరంతరం 24/7 శ్రీశైలం క్షేత్రం చుట్టూ తిరుగుతూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ఎస్పీ. వాహనాలు, భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలను గుర్తించి ట్రాఫిక్ పాయింట్లను ఏర్పాటు చేయడంతో పాటు సరిపడా సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. .వివిధ రాష్ట్రాల నుంచి శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులు వారి వాహనాలను ఇతరులకు ఇబ్బంది కలిగేలా రోడ్డుపైన పార్కింగ్ చేయకూడదని సూచించారు ఎస్పీ. రింగురోడ్డు వెనకాల గల , RTC బస్టాండ్ వెనక పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేయాలన్నారు.



















