హైదరాబాద్ : రాష్ట్ర సచివాలయంలో మహిళల భద్రత, సంక్షేమం, సాధికారత కోసం అవలంబించాల్సిన నూతన విధానాలపై పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. దనసరి అనసూయ (సీతక్క) పలు కీలక శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు విస్తృత సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళా భద్రతను మరింత సమగ్రంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలులో ఉన్న షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సైబర్ క్రైమ్ నియంత్రణ చర్యలు సమర్థవంతంగా పని చేస్తున్నప్పటికీ, విద్యాసంస్థలు, హాస్టళ్లు, కార్యాలయాలు, రాత్రి వేళల ప్రయాణాలు, డిజిటల్ వేదికలు, అసంఘటిత రంగం వంటి విభిన్న రంగాల్లో ఇంకా వ్యవస్థాపరమైన లోపాలు ఉన్నాయని సమావేశం అభిప్రాయ పడింది. వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీమతి సీతక్క మాట్లాడుతూ మహిళా భద్రతను కేవలం చట్టపరమైన అంశంగా కాకుండా మౌలిక వసతులు, సాంకేతికత, అవగాహన, పర్యవేక్షణ, బాధ్యతాయుత పరిపాలనల సమన్వయంతో చూడాల్సిన అవసరం ఉందన్నారు. మహిళల రక్షణ కోసం విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థల్లో, కంపెనీల్లో ఐసీసీ కమిటీలకు తప్పనిసరి ఆడిట్ వ్యవస్థను అమలు చేయాలని సూచించారు. రాత్రి 8 గంటల తర్వాత మహిళా ఉద్యోగులకు జీపీఎస్ అనుసంధానిత సురక్షిత రవాణా విధానం ఉండాలని మంత్రి సూచించారు. అసంఘటిత రంగ మహిళల కోసం ప్రత్యేక నమోదు, గుర్తింపు కార్డు, ఫిర్యాదు వ్యవస్థ ఏర్పాటు చేయాలన ఆదేశించారు. ప్రజా రవాణాలో సీసీటీవీ పర్యవేక్షణను బలోపేతం చేసి పీక్ అవర్స్లో భద్రతా ఆడిట్లు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశానికి ఉన్నతాధికారులు సంజయ్ కుమార్, శికా గోయల్, క్రిస్టినా చొంగ్తు, అనితా రామచంద్రన్, ప్రియాంకా వర్గీస్, శృతి ఓజా, దివ్యా దేవరాజన్ తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

















