అమరావతి : గత జగన్ రెడ్డి సర్కార్ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. కూటమి సర్కార్ కొలువు తీరాక సీన్ మారిందన్నారు. గతంలో కంటే అత్యధికంగా నిధులను ఈసారి బడ్జెట్ లో కేటాయించడం జరిగిందని చెప్పారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, హౌసింగ్ బడ్జెట్ పద్దుపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. జాతీయ స్థూల ఉత్పత్తిలో 10 శాతం మేర వ్యవసాయం నుంచి ఏపీ కంట్రిబ్యూట్ చేస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్, ప్రభుత్వ మద్దతు అనే పంచసూత్రాల విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.
22.5 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్నాయని చెప్పారు. ఈ ఏడాది 69 వేల కనెక్షన్లు కొత్తగా ఇచ్చాం అన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.13,722 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. 1250 మెట్రిక్ టన్నుల మైక్రో న్యూట్రియెంట్లను కూడా వ్యవసాయానికి సరఫరా చేశాం అన్నారు. అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేల మొత్తాన్ని రైతులకు మూడు విడతల్లో ఇస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో రూ.7500 మాత్రమే రైతులకు ఇచ్చారు. దానికి రెండింతలు మేర రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.14 వేలు ఇస్తున్నాం అన్నారు.















