హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో ఎవరూ ఊహించని రీతిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అద్బుత విజయాన్ని నమోదు చేసింది. ఓ వైపు ప్రతిపక్ష పార్టీలను ఖంగు తినిపించి విస్తు పోయేలా చేసింది. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో భారీ ఎత్తున స్థానాలను కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం కనిపిస్తోంది. ముందు నుంచీ పకడ్బందీ ప్లాన్ తో ముందుకు వెళ్లారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఒక్కో నియోజకవర్గానికి ముందస్తుగానే టీంలను పంపించారు. సర్వేలు చేయించారు. కేవలం గెలుపు గుర్రాలకే ప్రయారిటీ ఇచ్చారు. ఇంకెవ్వరినీ ప్రోత్సహంచలేదు. దీంతో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. తమకు ఎదురే లేదని చాటారు.
ఈ సందర్బంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన ఫలితాలు వెలువడిన వెంటనే హుటా హుటిన ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడే ఉన్న ఏఐసీసీ సీనియర్ నాయకురాలు, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఆమె సీఎం రేవంత్ రెడ్డిని, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ను అభినందనలతో ముంచెత్తారు. ప్రియాంకను కలిసిన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ విజయం తమకు మరింత బలాన్ని ఇచ్చిందని అన్నారు. భారీ గెలుపును అందించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.















