అమరావతి : రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన 5 ఏళ్ల పదవీ కాలంలో సాగు, తాగు నీటి రంగాలను పనిగట్టుకుని నిర్వీర్యం చేశాడని మండిపడ్డారు. అన్ని రంగాల కంటే సాగు నీటి రంగమే తీవ్ర విధ్వంసానికి గురైదని ఆందోళన చెందారు. ప్రత్యేకించి సాగు నీటి సంఘాలను పూర్తిగా పక్కన పెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు నిమ్మల రామానాయుడు. ఇదిలా ఉండగా ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, కడా కమిషనర్ ప్రశాంతి, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సిఈలు, ఎస్ఈలు, ఈఈలు హాజరయ్యారు.
వాటర్ సెక్యూరిటీ, వాటర్ క్యాలెండర్, భూగర్భ జలాలు పెంపు వంటి వాటర్ పాలసీలపై సాగునీటి సంఘ అధ్యక్షులకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని ఈ సందర్బంగా చెప్పారు. ఈ నెల ఆఖరి వారంలో అమరావతిలో సాగునీటి సంఘాల అధ్యక్షులతో సమావేశం జరుగుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తప్పిదాలను సరిచేసుకుంటూ, ఇరిగేషన్ రంగాన్ని చంద్రబాబు గాడిలో పెడుతున్నారని చెప్పారు నిమ్మల రామానాయుడు. సాగునీటి సంఘాలకు పూర్వ వైభవం కల్పించి రైతులను భాగస్వాములను చేసిన ఘనత ముఖ్యమంత్రిదేనని పేర్కొన్నారు. వైసిపి పాలనలో సాగునీటి సంఘాలు లేక, రైతుల ఇబ్బందులను పట్టించుకునే నాధుడే కరువయ్యారని అన్నారు.
















