ఖమ్మం జిల్లా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు బీజేపీపై. బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో ఎన్టీఆర్ కు అభిమానులు, చంద్రబాబుకు సహచరులు, అనుచరులు ఉన్నారని అన్నారు. వాళ్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే..తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలని చూసిన బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చాలని పిలుపునిచ్చారు. అదే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి అని అన్నారు రేవంత్ రెడ్డి. ఆనాడు బ్రిటీష్ పాలనలో ఎంత దారుణంగా ఉండేదో ఇప్పుడు ఇండియా బీజేపీ పాలనలో అంతే దారుణంగా ఉందన్నారు. ఎలాంటి తేడా కనిపించడం లేదంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
పేద వారిని విభజించు పాలించు అనే బ్రిటీష్ సిద్దాంతాలతోనే బీజేపీ కూడా పాలన కొనసాగిస్తున్నదని ఆరోపించారు. ఈ రోజు ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (CPI) శత వసంతాల వేడుకలో పాల్గొనడం ఒక అరుదైన సందర్భం అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. చరిత్రలో కాంగ్రెస్ – కమ్యూనిస్టుల మైత్రి సంచలనాత్మక రాజకీయ ఫలితాలనే కాదు దేశ ప్రజల పక్షాన చరిత్రాత్మక విధాన నిర్ణయాలు తీసుకోవడం లోనూ కలిసి పని చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. మళ్లీ ఐక్యంగా పోరాడి కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో దేశంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు.
















