నల్లగొండ జిల్లా : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన పోలీసులపై విరుచుకు పడ్డారు. లా అండ్ ఆర్డర్ ను పరిరక్షించాల్సిన వీళ్లు ఏకంగా అధికార కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సోమవారం హుజూర్ నగర్ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జగదీశ్ రెడ్డి. కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తి చూపే మా బీఆర్ఎస్ అభ్యర్థులు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి, భయపెట్టి కాంగ్రెస్ వాళ్లకు అప్పచెప్తున్నారని మండిపడ్డారు. ఇది మంచి పద్దతి కాదన్నారు.
చింతలపాలెం, మఠంపల్లి, గరిడపల్లి, హుజూర్ నగర్ ఎస్ఐలు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని అన్నారు జగదీశ్ రెడ్డి. ఇప్పటికైనా మీ విధులు సక్రమంగా చేయాలని, భవిష్యత్తులో ఇరకాటంలో పడితే ఏ కాంగ్రెస్ నాయకుడు మిమ్మల్ని కాపాడాలేడని హెచ్చరించారు. ఎన్ని దౌర్జన్యాలు చేసినా తమ గులాబీ సైనికులు ధైర్యంగా పోరాడుతున్నారని వారికి హ్యాట్సాఫ్ చెబుతున్నానని అన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి విశేష ఆదరణ చూపుతున్నారని చెప్పారు. మీ అనుచరులు, నాయకుల ఆగడాలను ఇప్పటికైనా అడ్డుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి.
















