హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు. సీఎం హిందువులను, హిందూ దేవతలను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఎంఐఎం కు సలాం చేస్తుందన్నారు. ఈ విషయాన్ని స్వయంగా రేవంత్ రెడ్డి తన మాటలతో , చేతలతో నిరూపించారని పేర్కొన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ముస్లింల ఓట్ల కోసం వారి మెప్పు పొందేందు కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తోందన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు కేంద్ర మంత్రి. కాంగ్రెస్ హిందువుల పట్ల లోతైన ద్వేషాన్ని కలిగి ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వచ్చాక హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ కూడా పదే పదే హిందూ దేవుళ్లును, హిందూ సంస్కృతిని కించ పరుస్తూ వచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ అనుకోకుండా గెలిస్తే, హిందువులు గౌరవంగా బయటకు అడుగు పెట్టలేరని ముందే తాము హెచ్చరించామన్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇందుకు మినహాయింపు ఏమీ కాదన్నారు. హిందువులు, హిందూ దేవుళ్ల పట్ల కాంగ్రెస్ కలిగి ఉన్న ద్వేషం ఇప్పుడు బయట పడిందన్నారు. హిందూ సమాజం తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు బండి సంజయ్ కుమార్ పటేల్.















