Ponnam Prabhakar : హైదరాబాద్ : రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ponnam Prabhakar) కీలక వ్యాఖ్యలు చేశారు. మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న ఆర్టీసీ క్రమ క్రమంగా లాభాల బాటలోకి వస్తోందని అన్నారు. అయితే ప్రభుత్వం నుండి నెలవారీగా వస్తున్న మహాలక్ష్మి టికెట్ ఆదాయమే కాకుండా ఆర్టీసీ అదనపు ఆదాయంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. సచివాలయంలో ఆర్టీసీ ప్రగతిపై సమీక్ష చేపట్టారు. ఆర్టీసీలో ఇప్పటి వరకు మహిళలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించు కున్నారని తెలిపారు. 7980 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. టికెట్ ఆదాయంతో పాటు టికెటేతర ఆదాయంపై దృష్టి సారించాలని పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచించారు.
Minister Ponnam Prabhakar Comments
ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు, వికారాబాద్, బీహెచ్ఈఎల్, మియాపూర్, కుషాయిగూడ, దిల్ సుఖ్ నగర్, హకీంపేట్ , రాణిగంజ్, మిథానితో పాటు పలు డిపోలు నష్టాల బారిన ఉండడానికి గల కారణాలు , స్థానిక పరిస్థితులు, ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని ఆదేశించారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
నగరంలో ఇప్పటికే 500 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నందున పీఎం ఈ- డ్రైవ్ కింద హైదరాబాద్ కి కేటాయించిన 2 వేల బస్సులు విడతల వారిగా రానుండడంతో, అందుకు సంబంధించిన చార్జింగ్ స్టేషన్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఇతర ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read : CM Revanth Strong Focus : రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష
















