Air India : ఢిల్లీ నుండి వాషింగ్టన్ డీసీకి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపం కారణంగా మధ్యలోనే నిలిపివేయాల్సి వచ్చింది. జూలై 2వ తేదీన బయలుదేరిన AI 103 విమానం ఆస్ట్రియాలోని వియన్నాలో ఇంధనం నింపేందుకు దిగిన సమయంలో సాధారణ తనిఖీ లోపల సాంకేతిక సమస్య గుర్తించబడింది.
Air India Flight…
ఈ సమస్య తలెత్తడంతో, ఎయిర్ ఇండియా (Air India) అధికారికంగా విమాన సర్వీస్ను రద్దు చేసింది. అయితే విమానంలో ఉన్న ప్రయాణికులెవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని, వారు అందరూ సురక్షితంగా ఉన్నారని సంస్థ స్పష్టం చేసింది.
ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి వివరణ:
“AI 103 విమానం ఢిల్లీ నుంచి వాషింగ్టన్ డీసీకి బయలుదేరింది. ఇంధనం నింపేందుకు వియన్నాలో ఆగిన సమయంలో సాధారణ పరీక్షల్లో సాంకేతిక లోపం బయటపడింది. దాన్ని వెంటనే పరిష్కరించేందుకు ప్రయత్నించినా, అది ఎక్కువ సమయం తీసుకునే పని కావడంతో విమాన సర్వీసును రద్దు చేయాల్సి వచ్చింది,” అని సంస్థ ప్రతినిధి వెల్లడించారు.
ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు:
విమాన సర్వీస్ రద్దు కావడంతో, ప్రయాణికులకు మరో విమానం బుకింగ్ లేదా టికెట్ మొత్తాన్ని తిరిగి చెల్లించే అవకాశం ఇవ్వబడింది. అంతేకాక, వియన్నాలో బస కోసం హోటల్ సౌకర్యాలు కూడా ఎయిర్ ఇండియా (Air India) కల్పించింది. ప్రయాణికులంతా వియన్నాలోనే సురక్షితంగా ఉన్నారని సంస్థ తెలిపింది.
గత విమాన ప్రమాదం నేపథ్యంగా ఆందోళనలు:
గతంలో గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన AI-171 విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా విమానాలకు మచ్చతెచ్చింది. ఆ విమానంలో 242 మంది ప్రయాణికులలో 241 మంది మరణించగా, ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన తరువాత ఎయిర్ ఇండియా తన విమానాలపై సమగ్ర తనిఖీలు చేపట్టినా, తాజాగా ఇలా సాంకేతిక లోపాలు వెలుగులోకి రావడం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తోంది.
సంస్థ హామీ:
ఎయిర్ ఇండియా అధికారుల ప్రకారం, ప్రయాణికుల భద్రతకు తమకు ప్రాధాన్యత ఉందని, ప్రతి ఘటనను గంభీరంగా పరిశీలిస్తున్నామని, ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Also Read : Make in India-China Shocking : ప్రత్యేక ఎరువుల ఎగుమతులపై భారత్ పై ఆంక్షలు విధించిన చైనా


















